నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**************
న్యాయ నిర్ణేత
దోసపాటి వెంకట రామచంద్ర రావు గారు
**********""""
అంశం: లోక కల్యాణం
*******"***********
కవి వరుల జాబితా
1.కోరాడ నరసింహారావు గారు
2.అపరాజిత్ రెడ్డి గారు
3.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
4.కాసుల ధీరాజ శర్మ గారు
5.డా.వేమూరి సత్యవతి గారు
6.కవిత వెంకటేశ్వర్లు గారు
7.గంగపురం శ్రీ నివాస్ గారు
8.గంటి మీనా కుమారి గారు
9.డా.తంగిరాల నాగలక్ష్మి గారు
10. కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
11సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
12.కొంజేటి రాధిక గారు
13.దారల విజయ కుమారి గారు
14.బొప్పెన వెంకటేష్ గారు
15.వేదాంతం సురేష్ బాబు గారు
16.లలితా చండి గారు
17.సింహాద్రి వాణి గారు
18.ఏడెల్లి రాములు గారు
19.కొమురవెల్లి అంజయ్య గారు
20.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
21.ముడుంబ తిరువేంకటాచార్యులు గారు
***********
సమీక్షలు
కవితాగానం సీజన్3
మార్గశిమాస పౌర్ణమి నగదు పురస్కారాలలో
ప్రథమ స్థానంలో నిలిచిన కవితా శీర్షిక
"భారతీయ సంస్కృతీ-లోకకళ్యాణస్పూర్తి"
ఒక చక్కని భావగీతంలా
సాగింది.భారతీయసంస్కృతిలో మమేకమైన ఎందరో
మహనీయుల కృషిఫలితం.వారిత్యాగజీవనవిధానాన్ని
కవి మన కళ్ళముందుంచారు.లోకకళ్యాణం కోసమే తపించినవారెందరోనని వివరించారు.అద్వైతాన్ని బోధించిన
శంకరులు,తిరుమంత్రాన్ని పదిమందికి తెలిపిన రామానుజులు లోకకళ్యాణార్ధమేనని పదబంధం చేశారు.
ధర్మగ్లాని సంభవించిన ప్రతీసారి అవతరించిన మానవతామూర్తి,ఆకలితీర్చే రంతిదేవులు,శరీరాన్ని చీల్చిచ్చే
శిబిచక్రవర్తులెందరు జనించిన ఆర్యావర్తనం.అనాదిగా
కర్మమూర్తుల తపోధనం.అందరూ బాగుండాలి అందులో మనముండాలనే మహనీయులతో నిండిన భారతీయతే
లోకకళ్యాణికై స్పూర్తీ దీప్తీ అని భావవీచికలను తమ భాషా
విన్యాసంతో చక్కగా వివరించారు.*
*ముడుంబ తిరువేంకటాచార్యులు* *గారికి*శుభాభినందన*లు.*
కవితాగానం సీజన్3మార్గశిమాస పౌర్ణమి నగదుపురస్కారాల కవితలపోటి లో
తృతీయస్థానంలో నిలిచిన
పద్యప్రక్రియలో రాశిన శీర్షిక
"లోకోసమస్తాసుఖినోభవంతు".
చందోబద్దంగా సీస,తేటగీతి పద్యాలు ఎంతో హృద్యంగా
రచించారు.ప్రతిపద్యం ఒక ఆణిముత్యం .లోకకళ్యాణమంటే
ఏమిటో చక్కగా వివరించారు.
ఎంతో డబ్బుఖర్చుపెట్టి డాబు దర్పంగా దేవళములు కట్టడం
గొప్పకాదని,సాటి మనిషిలోనే దైవత్వాన్ని గుర్తించలేకున్నారని మనుషులతత్వాన్ని తెలియజేశారు.
అలాగే అన్నదానం,విద్యాదానం,ధనదానం చేసిన అది లోకకళ్యాణమేనని విశదీకరించారు.చివరిపద్యంలో
ఈతిబాధలులేకుండా ఇలలోన జనులంతా ఆరోగ్యంగా ఉండి
సుఖశాంతులలతో ఉంటే అదేలోకకళ్యాణమని లోకోసమస్తాసుఖినోభవంతు అని ధీవించారు.
*గంటిమీనాకుమారి*
*శుభాభినందనలు.*
కవితాగానం సీజన్3మార్గశిరమాస పౌర్ణమి నగదు పురస్కారాలలో
ద్వీతీయస్థానంలో నిలిచిన కవితాశీర్షిక
"ఇప్పుడిక నీవంతు"
ప్రకృతిలో జరిగే ప్రతి మార్పులోళ ఎదో ఒక ప్రయోజనం
నిండివుంటుంది.మబ్బులు మేఘాలు వీటిని చీల్చుకొనే
సూర్యుని కిరణాలిచ్చే సందేశాం చాలుకదా!
కష్టాలు కన్నీళ్ళతో నిండిన వ్యధాభరితహృదయాలకు స్వాంతన కలిగించెదెవరని ప్రశ్నిస్తూ "ఇప్పుడిక నీవంతని"
మార్మికతత్వాన్ని తెలియజేశారు.
"ఒక ఉత్తేజగీతం ఎగతన్నుకునొచ్చేలా గుండెలను చీల్చుకో...
మానవాళి కడగండ్లపై శంఖం పూరించేలా గొంతును సవరించుకో....'అని తన పదవిన్యాసంతో అబ్బురపరిచారు.
అలాగే అణగారిన బ్రతుకులకు ఆశాకిరణమై వాహనాలు లగాలని,"మనసును మెలితిప్పిన దృశ్యం శబ్ధం దిశగా
మానవతను సంధించి....
మనుషులమధ్య శూన్యాన్ని మంచితనంతో నింపి..."
సమస్తమానవాళికోసం పరితపించినపుడే లోకకళ్యాణమని
ఎంతో భావగర్భితంగా సెలవిచ్చారు.
*డాక్టర్.*
*దారల విజయకుమారి గారికి* *శుభాభినందనలు.*
కవితాగానం సీజన్3మార్గశిమాస పౌర్ణమి నగదుపురస్కారాల కవితలపోటి లో
తృతీయస్థానంలో నిలచిన మరొక కవితాశీర్షిక"లోకకళ్యాణం ప్రతిఒక్కరి బాధ్యత"గా గుర్తుచేస్తూ కవి రచననైపుణ్యంతో చక్కని
భావతరంగాలను వెదజల్లారు.లోకంలో జనులు దురాశ,స్వార్ధం తో సాటి మానవాళిని విస్మరిస్తున్నారని
వాపోయారు. ఆకలిబాధలుతీరాలన, విధ్యాసుగంధం వెల్లివిరియాలని ఆశిస్తున్నారు.దురాశాదుర్గంధంతో పచ్చని
ప్రకృతిని కబళిస్తూ కలుషితం చేయడం మాని స్వచ్ఛమైన
పరిసరాలద్వారా ఆరోగ్యాన్ని అందించకలిగితే అదే
లోకకళ్యాణమని తెలిపారు.
*శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారికి*
*శుభాభినందనలు.*
[: కవితాగానం సీజన్3 మార్గశిమాస పౌర్ణమినగదు పురస్కారాల కవితలపోటి లో
తృతీయస్థానంలో నిలిచిన
కవితాశీర్షిక"ఆకపచ్చని వసంతం"లో చక్కని పదలాలిత్యంతో
లోకకళ్యాణమంటే ఏమిటో తమదైన భావనలోతో వెలిబుచ్చారు. సాఖరమధనంలో అటూ అమృతంతో పాటు
హాలహలంకూడ ఉధ్భవించినట్టు మానవమేధస్సులో విజ్ఞానం వినాశనం కూడా ఉంటాయన్నారు.దానికి ఉదాహరణగా కరోనావైరస్సు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేశారు.ఒక పక్క పచ్చని చెట్లను నరికివేస్తు,మరోపక్క
ప్లాస్టిక్ వాడకంతో వాతావరణకాలుష్యాన్ని సృష్టించడం
తగదని సౄలవిచ్చారు.అది అరికట్టగలగితే ఆరోగ్యకరవాతావరణం నెలకొంటుందని తమ భావనలను తెలిపారు.
**సింహాద్రి వాణి గారికి *శుభాభినందనలు.*
******""
కవితలు
******"
1
కవన జ్యోతి పౌర్ణమి కవితల పోటీ.... !
అంశం :- @ లోక కళ్యాణం @
కోరాడ నరసింహా రావు.. !
శీర్షిక :- హృదయ నైర్మల్య
సుహృద్భావమే... !
**************
వ్యక్తివికాశమే,సమాజవికాసం
సర్వతోముఖ. ఆనందమయ
సమాజవికాశమేలోకకల్యాణం
లోక కళ్యాణానికి...
మనసు మంగళవాయిద్యాలు
. పలికించాల్సిందే... !
హృదయం సకల శుభకర
వేదమంత్రాలను...
పఠించాల్సిందే !!
స్వీయ నియంత్రణా....
మహాయజ్ఞం లో....
ఈర్ష్యాసూయలు, పగలు -
ప్రతీకారాలు...ద్వేషాలు, మోసాలు, సమిధలై కాలి...
బూడిదై పోవాల్సిందే.. !!
అప్పుడే... కాలపురుషుడు...
ప్రేమామృతాన్ని ప్రసాదించేది!
అపుడే... ప్రతివ్యక్తీ...
తననుతాను ప్రేమించునటుల
పొరుగు వారినీ...
ప్రేమించ గలిగేది... !!!
అపుడే... దయ,సేవ,త్యాగాల తో... సమాజం పరిమళించేది!
అపుడే... స్నేహ, సుహృద్భావ
ఐకమత్య ఫల, పుష్పాలతో
సమాజం ఆనంద నందన వనం గా... మారేది... !
ఆదికదా... లోక కళ్యాణం... !
అపుడేకదా..ఈలోకం...శుభకర
సుందరం... !!
*********************
2.
అంశం: లోక కల్యాణం
శీర్షిక: సేవా దృక్పథం!
పేరు:యం అపరాజిత్ రెడ్డి
ఊరు: సూర్యాపేట
సేవా దృక్పథం మనిషి నైజమై
మానవత్వంతో తోటి మనిషిని
కష్ట సమయంలో ఆదుకుంటే
ఉన్నత ఉద్విగ్న క్షణాలను చవిచూస్తాం,,,,,!!
మహాత్మా గాంధీ తన బట్టలు తానే ఉతుక్కోవడమే కాకుండా
మురికి వాడలను శుభ్రం చేసేవాడు ,,,,!!
కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రభలి నాగరమంతా చిగురుటాకులా వణుకుతున్నప్పుడు
వివేకానంద తన ఆరోగ్యం సరిగా లేకున్నా రామకృష్ణ మిషన్ సభ్యుల సహకారంతో యుద్ధప్రాతిపదికన వైద్య సేవలు అందించిన మహనీయులు,,,,,,!!
ఉద్గ్రంధాలు రచించి ఉపన్యసించినంతనే సరిపోదు
వాటిని తామై తాము ఆచరించి చూపించిన వారే మానవతామూర్తులు,,,,,,!!
దేశంగాని దేశం భారత్ కు వచ్చి చేతిలో చిల్లి గవ్వలేకున్నా కలకత్తా నగర రోడ్లపై దీనులను అంటువ్యాధి గ్రస్తుల సేవకోసమై చందాలు సేకరించి నిర్మల్ హృదయ్ స్థాపించి ఆకలి కోరల్లో ఉన్న అభాగ్యులకు రోగులకు ఆపన్నహస్తాన్నందించిన మహనీయురాలు మథర్ థెరిస్సా!!
దేశమంతా కరోనాతో గణనీయంగా మరణాల భారిన పడుతున్న తరుణం
సుదూర రాష్టాలనుంచి వలసవచ్చి మనరాష్ట్రములో పనులకు తమపిల్లలను తల్లిదండ్రులను వదలి వచ్చిన కార్మికులు తమవాళ్ళ దగ్గరకు చేరాలని తపన అందులోనే చేయడానికి పనుల్లేవు ఎంతదూరమైనా నడిచివెల్తున్న తరుణం ట్రాన్స్ పోర్టు అనేదే లేక నడుస్తూ నానా యాతన పడుతున్న రోజులు
అప్పుడే దివిలోని తార భువికి దిగివచ్చి వరాలిచ్చినట్లు సోనుసూద్ అను సినిమా యాక్టర్ వాళ్ళ కుటుంబాల నందరిని సుదూర స్వ రాష్టాలకు బస్సులు పంపించి తగిన ఆహారాన్ని అందించిన ఈ కాలం మహనీయుడు!!
ఇలా సేవా దృక్పథం ప్రతిమనిషి గుండెగూటిలో మానవత్వం వెల్లివిరిస్తే లోక కల్యాణంతో సుఖశాంతులతో ఆ శ్రీమన్నారాణుడు ఈ ఇలపైనే నెలవైవుంటాడు,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం: ఈ కవిత నా కలం సేతయని అనువాదం అనుసరణ కాపీ కానీ కాదని నా హామీ.
..............................
3.
కవితాగానం( సీజన్ -3)
పౌర్ణమి కవితా పోటీలకు
తేది:-04-12-22
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
సెయింట్ లూయిస్
యు.ఎస్.ఎ.
అంశం:- లోక కల్యాణం
శీర్షిక:- జీవిత సాఫల్యం
..............................
క్షీరసాగరమథనం లో ఉద్భవించిన
కాలకూట విషంను గరళంనందుంచుకుని
లోకాన్ని రక్షించి పరమశివుడు నీలకంఠుడాయే....!
మూడాచారాలు,అంధవిశ్వాసములు రూపుమాపి
బాల్యవివాహాలు ,సతీసహగమనాలు నిరోధించి
స్త్రీ చదువుకై అహర్నిశలు పోరాడి
తన భర్త దహనసంస్కారాలు తానే చేసిన సావిత్రిభాయ్ పూలే నేటికి చిరస్మరణీయురాలు..!
దేశం నాకెమిచ్చిందని గాక
దేశానికి నేనేమి చేసాను అన్నది ఆచరించి దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన భరత్ సింగ్, అల్లూరి ప్రాతః స్మరణీయులు...!!
శరీరం బుద్భుదమని
పరోపకారం ఇదం శరీరమని
మానవత్వమే మాధవత్వమని
సమాజ కల్యాణం కొరకు
జీవిత పర్యంతం పోరాడిన
మహాత్మా గాంధీ, వినోబాబావే, దుర్గాబాయ్ దేశముఖ్ అడుగు జాడల్లో నడచిన జీవితసాఫల్యత నొందు.......!!
................................
ఇది నా స్వీయకవిత
అయ్యలసోమయాజుల ప్రసాద్
యు.ఎస్.ఎ.
4
కాసుల ధీరాజ శర్మ
*
అంశం : లోక కల్యాణం
శీర్షిక : శోక నివారణం
యథార్థ లోకాల గణనల తర్జనభర్జనల వాదనలు!
ద్విగుణీకృత సప్తలోకాలు ఉన్నాయన్న ఋషి పుంగవులు!!
పదునాలుగు లోకాలు విశ్వకల్యాణ శ్రేయోదాయక కారణాలు!
విశ్వ సృష్టి స్థితి లయలకు సృష్టించిన మూల స్తంభాలు!!
దుష్ట శిక్షణ శిష్టరక్షణలకై అనేకానేక అవతారాలు!
ధర్మసంస్థాపనలకై ఆలోచనామృత పునరావృత ప్రచోదనలు!!
ప్రతి మదిలో మెదిలే పుష్కలమైన సందేహాలు!
ప్రతి మదికి తగిలి రగిలే తార్కిక సావధాన సమాధానాలు!!
సత్యాసత్య విచక్షణలకై తెలుసుకోదగిన బ్రహ్మ విద్యలు!
నిత్యానిత్య తత్వార్థములకై అపరిమిత అన్వేషణలు!!
సమస్త లోకాల సుసంపన్నతకై కావాలి తపోనిష్ఠలు!
వేద వేదాంగ పురాణ ఇతిహాసాది అపూర్వ వాజ్ఞయాలు!!
అంకురించి మొలకెత్తి చిగురించి ఫలించే చైతన్య రూపాలు!
ఆత్మోద్ధరణలకై అనుభవపూర్వక పాఠాలతో గుణపాఠాలు!!
పాపపుణ్య సుఖదు:ఖాల పేరిట అనుభవాలు!
పారమార్థిక చింతనలతో పరిష్కార మార్గాలు !!
ప్రకృతిని పరిరక్షించుటకై దృఢ సంకల్పబల ఆచరణలు!
జలవనరుల సిరులను భావితరాలవారికి సంరక్షణలు!!
వ్యర్థ కాలయాపనలాపి తెలుసుకోవాలి (వి)జ్ఞాన మార్గాలు!
ఉత్తమోత్తమ గతులకై పఠించాలి పరమ పవిత్ర ఉద్గ్రంధాలు!!
శోక నివారణలకై పరిశ్రమించి ఉద్యమించాలి సకల జనులు!
శాంతస్వభావులై త్యాగధనులై నడకసాగించాలి మానవులు!!
మార్గశీర్షమాసమున జరుపుకోవాలి గీతాజయంతి ఉత్సవాలు!
భగవద్గీతార్థచంద్రిక సారాంశాల ఆచరణలో లోక కళ్యాణాలు!!
పై వచన రచన నా స్వీయరచనయే.
5
డా.వేమూరి.సత్యవతి
*
శీర్షిక "లోక-కళ్యాణకాంక్ష!"
ఇది తరచూ వినిపించే మాట!
నాయకుల నోట అందమన అసత్యమై వల్లించేదే!
ఆర్ష సంప్రదాయపు శాంతిపాఠమై ధ్వనించేది!
కలహపు సన్నివేశం చివర నారదముని కోరేది!!
ఎన్నో గాథలు,గ్రంథాలలో అక్షరంంగా నిలిచేది!
సుభాషితంగా సామెతగా,పలుకుగా,పద్యంగా
పరిమళించేలా ప్రచారం చేయాలనుకున్నా
కలిలో కలికానిగ్గూడా కన్పించకుండా చేసే స్వార్ధం!
లోకకళ్యాణకాంక్ష
ప్రజాస్వామ్యపు పుస్తకాల లోనే దాచిపెట్టారా?
వేదికలపై వల్లెవేసె వలలోంచి పైకితీసి
మార్గశీర్షపు కవనజ్యోతిగా వెలుగులతో..
కమనీయమై మందికి మనసుకి మార్గదర్శియైంది!
నాకోసం-మనకోసమైన మంత్రం కావాలి!
జీవిద్దామనేమాట జీవితాన్నిద్దామని పలికితే..
అందరికోసం మంచికోరుకునే రక్తీ,భక్తీ
మాకశ్చిద్దుఃఖవాన్భవేత్ అనేది
విశాలభావమేకాదు,ఉపనిషద్వాక్యంకూడా!!
ఇది నా స్వంత రచన!
6.
కవితా గానం కవితల పోటీ
తేదీ::05.12.22...సోమవారం
అంశం:: లోక కళ్యాణము
శీర్షిక:: సర్వే జనా సుఖినో భవంతు
ఎందరో మహానుభావులు
మరెందరో మహర్షులు
ఇంకెందరో మహనీయులు
ఎందరెందరో త్యాగమూర్తులు
లోక కళ్యాణము కొరకు
శోకాన్ని బాపుట కొరకు
స్వార్థానికి లొంగక
స్వలాభాన్ని ఎంచక
జన హితము కోసము
ప్రజా క్షేమము కోసము
అర్పించారు ప్రాణాలు
సమర్పించారు ఆస్తి పాస్తులు
శ్రీరాముడు చేసే ప్రజల కొరకే పాలన
శ్రీకృష్ణుడు స్థాపించే ధర్మస్థాపన
ఎందరో రాజులు చేశారు ప్రజా పరిపాలన
లోక కళ్యాణము కొరకే నారదుడు
త్రిలోకాలలో పయనించినాడు
జనము శుభము కోరినాడు
సర్వేజనా సుఖినో భవంతుగా
సాగినాడు
లోకా సమస్త సుఖినో భవంతుగా సంచరించాడు!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు
8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
7
తేదీ: 06.12. 2022
అంశం: లోక కళ్యాణం
*"లోకోత్తర రామాయణం"*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
అమాయకపు సీతలున్నంత కాలం
లక్ష్మణ రేఖ గీసినా,
మాయాలేడి ప్రలోభాలకు
సులభంగానే బోల్తాపడుతారు
భయపెట్టే రావణాసురులున్నంతకాలం
వెర్రిబాగుల జనం భజన బాజా చేస్తూ
తోకలూపుతూనే ఉంటారు
స్వార్ధపు మందరలున్నంతకాలం
సంసార సాగరంలో
మోసపు గరళం చిలుకుతూనే ఉంటారు
మోహపు శూర్పణఖలున్నంతకాలం
ద్వేషపు జ్వాలలు
పొద్దస్తమానం రగులుతూనే ఉంటయి
గర్వపు వాలిలున్నంతకాలం
నిస్సహాయ సుగ్రీవులు కిష్కింద కొండల్లో
సాయపు పొద్దుకొరకు
ఎదురు చూస్తూనే ఉంటరు
పగోడీ ఇళ్లల్లో
ప్రజాస్వామ్య విభీషణుడుంటే
పాలోళ్ళ ఇళ్ళల్లో కూడా
మురిపాల పాలు పొంగుతాయి
అంగదుడి లాంటి అంగబలం,
హనుమ లాంటి సేవాగుణం,
లక్ష్మణుడి లాంటి మంత్రాంగం,
జగదబిరాముడి లాంటి
సకల సద్గుణాల రాజుంటే
రాజ్యంలో లోక కళ్యాణం
అలుగులు దూకుతుంది.
గంగాపురం శ్రీనివాస్
9676305949
8.
గంటి మీనాకుమారి
జిల్లా
*
శ్రీకాకుళం
ఫోన్ నెంబర్
*
________________________________________అంశం: లోక కళ్యాణం
శీర్షిక: "లోకాస్సమస్తా సుఖినోభవంతు "
ప్రక్రియ: పద్యములు
__________________________________________
తేగీ|| లెక్కలేనన్ని యాగములెన్నొ జేసి
దేవళములు నిర్మించగ దృష్టి పెట్టి
డాబు దర్పములకుబోయి డాంబికముగ
లక్షలను ఖర్చు జేస్తివి లక్షణముగ
సీ|| కానలేకుంటివిగద దైవమున్నీవు
సాటిమనిషిలోనస్థిరముండు
దేవుని యెప్పుడు దర్శించెదవొ యేమొ
లోకమునకును మేలొసగితినను
భ్రమలొ మిడుకుచు బాధ్యతలేకయు
సాటివారికి నింత సాయపడక
పురుషోత్తముని జేర పూజలెన్నో జేసి
చేరవచ్చినవార్ని చీదరించ
తేగీ|| సద్గతి పొంది చేరునా స్వర్గమందు
మానవుని సేవయే గద మాధవునికి
చేయు సేవయని యెరిగి చేయుమయ్య
జగతి యందున్న యట్టియు జనుల సేవ
తేగీ|| అన్నదానమునకు మిన్న యైనదేది
విద్య దానము జేసినవిలువ పెరుగు
ధనముదానము జేయగ ధర్మ వృద్ధి
పదియుకాలంబులు జనులు పచ్చగుంద్రు
తేగీ|| ఈతి బాధలు లేకుండు ఇలనుజనులు
లోకమంతయు సౌఖ్యము లొందుచుండ
ఆయురారోగ్యములతోడ అలరుచుండ
లోకకళ్యాణమేగద లోకులకును
"లోకాస్సమస్తా సుఖినో భవంతు "
9.
డా. తంగిరాల నాగలక్ష్మి
*
Auckland
ఫోన్ నెంబర్
*
64212331334
కవిత
*
లోక కళ్యాణం:
డా. తంగిరాల నాగలక్ష్మి
లోక కళ్యాణం కోసం ఏమి చేయాలి
ఏం చేస్తున్నాం
మనిషిని వెంటాడుతున్నాయ్ శత్రువుల్లా
అరిషడ్ వర్గాలు
స్వార్ధం ధన దాహమ్ లంచాలు
రికమండేషన్స్
అన్యాయం అక్రమం అవినీతి
ఇలా ఎన్నో ప్రబలుతున్న వాటిని
అరికట్టగలిగితే అదే లోక కళ్యాణమ్
మానవ ధర్మాలు నిర్వర్తించ గలిగితే
మన సంస్కృతిని అర్ధం చేసుకుని ఆచరిస్తే
తల్లి దండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవం తో
వారిని ఆదరిస్తే
సుఖ శాంతులతో ఉంటే ఇంట్లో కళ్యాణమే
ధర్మాన్ని కాపాడ గలిగితే
న్యాయాన్ని రక్షించ గలిగితే అదే
లోక కల్యాణం
యుద్ధాలు ఆపి ప్రపంచ శాంతి కోరాలి
మనిషి జీవితా లతో వ్యాపారం చేసే మదాంధులను మట్టు బెట్టాలి
సాటి మనిషి కన్నీరు తుడిచే మనసుండాలి
అప్పడే లోక కల్యాణ వైభోగం
సీతారాముల కళ్యాణం
శివపార్వతుల కళ్యాణం
పద్మావతీ వేంకటేశ్వర కల్యాణం
ఇలా దేవుడికి నిత్య కల్యాణం చేయటం
లోక కళ్యాణం కోసమే
ప్రకృతి పురుషుల సంగమమే నిత్య కళ్యాణం పచ్చ తోరణం
10.
మార్గశిర మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ కొరకు వ్రాసిన కవిత
అంశం,: లోక కల్యాణం
శీర్షిక:::: *లోక కల్యాణం ప్రతి ఒక్కరి బాధ్యత*
కవితలు ... తేదీ 06/12/2022
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
**********************************************
విషయాసక్తులై మంచిని విస్మరించి విలువల వలువలు తస్కరించి ...
విచ్చలవిడిగా విపులను వధించి,వాటంగా వెనకేసుకొని మదించి...
విషం కక్కుతున్న స్వార్థాన్ని తుంచి!!
మసకబారుతున్న మానవత్వానికి మల్లెల తెలుపు, పద్మం స్వచ్ఛతను అద్ది
పొగడపూవుల పరిమళం పులిమి...మందారాల మకరందంలో ముంచి...!!
గిరిజాశంకరుల లోక కల్యాణం జరిపి...
బాధాతప్త వేదనా భరిత హృదయాలను
మంచు పూల పల్లకిలో ఊరేగించాలి
కంది పూల తేనియను తాగించాలి !!
అడుగంటిన *మంచి*నీటి బావి ఊటల జాడలు
వెతికి పట్టినట్టు పట్టి ,
కనుమరుగయిపోతున్న లోకహితం వడిసి పట్టి
వాడ వాడల ప్రభోదించాలి మనసు పెట్టి...!!
లోకం జీవుల మయం...లోభం మనిషికి మాయరోగం
లాలసతో మనిషి ఆధిపత్యంకై సంహారం
దాని విరుగుడుకై వెల్లి విరియాలి...పిపీలికంతో సహా సకలజీవుల సౌఖ్యం సమకూర్చే సారస్వతము !!
దురాశా దుర్గంధము వెదజల్లుతూ ,
ధరిత్రిని కాలుష్య భూతం కబంధ హస్తాలలో నెట్టే
దుర్మార్గాన్ని దునిమి... *స్వచ్ఛమైన పచ్చని ప్రకృతిలో
ఆరోగ్య సౌభాగ్యాలే* *లోక కల్యాణం*అదే కమనీయం!!
అనాధల ఆకలి బాధలు తీర్చి విద్యా గంధం అందించే
ఆపన్నహస్తాలు...
అనునయించి సాంత్వన కూర్చే అమృత వాక్కులు లోక కల్యాణానికి నారద తుంబుర నాదాలై వినిపించాలి !!
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
6/12/22
11.
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను... అంశం.... లోక కళ్యాణం పేరు.. కొంజేటి .రాధిక ఊరు రాయదుర్గం
శీర్షిక... ఆధ్యాత్మిక మంత్రం
పాపభీతి మంత్రాన్ని ధ్యానిస్తూ...
తారకనామ జపంతో తరిస్తూ...
జనులంతా శాంతికి సంకేతాలై, ధర్మ పథంలో నడిస్తే లోక కళ్యాణం జరిగినట్టే...
అధర్మం రాజ్యమేలుతూ... అన్యాయం పట్టాభిషేక్తం చేసుకొని...
దురాశను రాజుగా చేసి...
అసూయ ద్వేషాలను రాణిగా చేసుకుని... అక్రమాలతో,లోభ మోహాల మంత్రి మండలితో...
దుష్ట రాజ్య పరిపాలనలో అంతా రాక్షసులే ... మానవత్వం నిండిన మనుషులు లేని సమాజంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగేదెప్పుడో అంతా నరరూప రాక్షసులే అయితే!?
కలి ఆహాకారాలతో కలియుగంలో అంతా అధర్మమే...
పశ్చాత్తాపాన్ని మరచి ప్రలోభాల ఒడిలో ఓలలాడుతూ,
మోసాల పసరు పూసుకొని...
ద్వేషాన్ని కవచంగా ధరిస్తూ,
పగప్రతీకారాలను ఊపిరిగా పిలుస్తూ...
ఇందరి రావణుల నడుమ ఎంతమంది శ్రీరామచంద్రులు మళ్లీ పుడితే లోక కళ్యాణం జరిగేనేమో...
లోకం క్షామంతో,
అబలల ఆక్రందనలతో లోక కంటకులతో లోకం వివస్త్ర అయింది...
జనుల మదిలో పశ్చాత్తాపపు మొలకలు మొలచి , పాపభీతి రక్తంలో పాకితేనైనా లోక కళ్యాణం జరిగేనా?
మళ్లీ ఉదయించే లోక కళ్యాణ సారధి ఎవరో వేచి చూడాలి.
హామీ పత్రం...ఈ కవిత నా సొంత రచన.
12.
కవన జ్యోతి సమూహం నిర్వహించు మార్గశిర పౌర్ణమి కవితల పోటీకి
*లోక కళ్యాణం*
మంచి చెడుల మధ్య సాగిన రామచరితం
జనులకు సన్మార్గంలో
నడవాలని ఉపదేశం
కైకేయి పెట్టిన నిబంధనకు
దశరథుడు వాగ్దానం
పితృవాక్య పరిపాలనలో
శ్రీరామచంద్రుని ఇంగితం
అడవుల పాలిట పన్నెండేళ్ళ సంచారం
తోడు సగభాగమంటూ సహచరి సీతమ్మ తల్లి సహధర్మం!
అన్న వదిన వదిలిపోగ
అడుగేసే సోదరుడు లక్ష్మణ సౌభ్రాతృత్వం
ఒకే బాణం ఒకే మాట
రామచంద్రుని తత్వం
ఏకపత్నీ వ్రతుడు సీతమ్మ ఎద గుడిలో
నిలిచిన దేవుడు
ప్రజారంజక పాలనలో
ప్రజలంతా సంతోషం సుభిక్షం
సమస్త కళ్యాణ గుణాభి రాముడు
నిరంతర మంగళ
కామితార్థ ప్రధానుడు
***
*సయ్యద్ జహీర్ అహ్మద్, *కర్నూలు*
*హామీ పత్రం*
ఈ కవిత నా స్వంతం. కవన జ్యోతి పౌర్ణమి కవితల పోటీకి వ్రాసినది. ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
13.
కవన జ్యోతి సమూహం
కవితా గానం పౌర్ణమి కవితల పోటీ కోసం
అంశం: లోక కల్యాణం
శీర్షిక: ఇప్పుడిక నీ వంతు
**********************
మట్టి కోసం మనిషి కోసం సృష్టి కోసం
బరువును మోసుకు తిరిగే మబ్బులు
దుఃఖ మేఘాలను వర్షింప చేసే చల్లగాలులు
రాత్రి సొమ్మసిల్లిన ఆశలను తట్టిలేపుతూ ఉదయించే సూర్యున్ని చూసావా
నిరాశా దుప్పటి ముసుగులో దాచుకుని
ఎంతసేపని నిద్రను నటిస్తావు.?
ఏ సాకులు చెప్పి..ఎన్నింటిపై నిందలను మోపుతావు..?
ఏవైపు నుంచైనా ఎవరైనా
కాంతిని మోసుకు రావాలని ఆశ పడతావు
కొందరి కన్నీళ్ళను ఎలా కొలవగలవు.?
బాధలను ఎలా లెక్కకట్టగలవు..?
ఇపుడిక నీ వంతు..!
ఒక ఉత్తేజగీతం ఎగతన్నుకుని వచ్చేలా గుండెను చీల్చుకో
మానవాళి కడగండ్ల పై శంఖం పూరించేలా గొంతును సవరించుకో..!
అలమటింతల అంధకారాన్ని చెదరగొట్టే చిరుదీపమై.
ఏ ఒక్కరికో..దేదీప్యమానంగా వెలుగొందిన అనుభవాన్నిచ్చి..
ఏ కొన్ని పాదాలకోసమో ఒక బాటకు రాళ్ళెత్తి..
అణగారిన ఆశల కోసం ఆకాశాన్ని పరచి
సామాన్యుని గుండె తడిని గుర్తుపట్టి..
ఏ లోగిలిలో నైనా సరే గాలిలాగే ప్రసరిస్తూ..
కొందరి గాయాలనైనా స్పృశిస్తూ..
నీ పట్టెడు మెతుకుల కోసం
జీవితమంతా మట్టిలోనే బతుకు వెళ్ళదీసే వాళ్ళ
ఆకలికి అన్నానికి మధ్య దూరమెంతో
నువ్వు కొలిచి..
ఏ కొందరి ఆత్మ విశ్వాసాలకైనా ఆకృతినిచ్చి..
మనసును మెలి తిప్పిన దృశ్యం శబ్దం దిశగా
మానవతను సంధించి
మనుషుల మధ్య శూన్యాన్ని మనిషితనం తో పూడ్చి..
సమస్త మానవాళి కోసం పరితపించినపుడే
లోక కల్యాణం
డా.దారల విజయ కుమారి
హామీ పత్రం
***********
నమస్తె సర్/మేడం
ఈ కవిత నా స్వంత రచన. అనువాదం కాదు ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
9177192275
14.
కవిత శీర్షిక : లోక కళ్యాణార్థం...
రాలే ఆకును ఎరువు చేసుకుని చివురులద్దే మృత్తిక సారాన్ని సాంతం విప్పాలి
రగిలే నిప్పుల నిధి నుంచి లేకిరణాలు కాచే రవి రహస్యాన్ని రాబట్టాలి
గింజలోంచి విశాల ప్రాణవాయువును ప్రసాదించే చినుకు చాకచక్యాన్ని ఒడిసి పట్టాలి
గాలి తెమ్మెరలు గడ్డి పోచలో ఊదిన ఉల్లాసాన్ని మోపులా చుట్టాలి
గిరిని చీల్చి నిలిచిన తరువు నిబ్బరాన్ని నింపాదిగా నింపుకోవాలి
ఇవన్నీ
ఎందుకంటే ?
ఒక్కందుకే..
జీవాత్మలో లయించేటందుకు
లోక కళ్యాణం కావించేటందుకు...!!
బొప్పెన వెంకటేష్
15.
కవితాగానం ( సీౙన్ 3)
""""""""""""""""""""""""""""""""""""
అంశం:- లోక కల్యాణం
"""""""""""""""""""""""""""""""""""""
దేశభక్తి త్యాగనిరతి
నీతి నిజాయితీలు
అందని గగన కుసుమాలై
కూర్చున్నాయి ఆకాశంలో
దేశ భవిష్యత్తు కావలసిన యువత
పెడదారులలో పయనిస్తూ
గంజాయి మత్తుకు బానిసలై
చిత్తయి పోతున్నది
దోపిడీలు దౌర్జన్యాలు
భూకబ్జాలు లిక్కర్ కుంభకోణాలు
ఓట్లకు నోట్ల వ్యవహారాలు
ఎమ్మెల్యేల కొనుగోళ్లు
బూతు పురాణాల రాజకీయాలు
నీతి లేని ప్రజాప్రతినిధులు
మందుకు పైసలకు
ఓట్లను అమ్ముకొనే
బానిసలైన వెర్రి గొఱ్ఱెలు
తాయిలాల కోసం
మనసుల్ని తాకట్టు పెట్టుకొనే
మధ్య తరగతి మనుషుల
మనుగడల త్రిశంకు స్వర్గాలు
వీటన్నింటినీ దాటుకుని విశ్వంలో
కాంతి కిరణాలు వెలుగాలని
శాంతి నివాసం కావాలని
లోక కల్యాణం జరగాలని ఆశిద్దాం.
""""""""""""""""""""""'"""""""""""""""""""""""""""""
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్
16
*అంశం* ,
---- *లోక కళ్యాణం..*
నిత్య పూజలెన్నో స్వామి నీకు
నిత్య బడిత పూజలెన్నో నాకు
అహం బ్రహ్మాస్మి అంటారు
నువ్వు వుండే గుడులన్నీ
బోసి బోసి నే రాకుంటే
నాలో నువ్వు వుంటే
వేరే గుడి ఎందుకు అంటా?
అయినా.....
ఆకాశమంతా వచ్చిపోయే
మేఘమాలల మెరుపులే
ఉరుములకు భయపడి
వణుకుతూ చిలకరించే
చినుకుల చిరుజల్లులకు
పరవశించి విరబూసే ప్రకృతి
ఎవరికోసమో కాదు .....
ఈ వాసంత కాంత ఆకుపచ్చ
చీరకట్టి పాడే కుహకుహ రాగాలన్నీ
ఎవరి కోసమో తెలియదా...
కాలం ఎవరికోసమూ ఆగదుఅంటూ
కనిపించేవన్నీ చెల్లాచెదురంటూ
నిలవని నీ మున్నాళ్ల ముచ్చట
కోసం చేస్తోంది కనిపించే ప్రకృతి
లోకా సమస్తా సుఖినో భవంతూ
అంటూ చేస్తోంది లోక కళ్యాణం.
లలితా చండీ
న్యాయవాది
హైదరాబాదు
9885552922
17.
కవితా గానం (సీజన్--3)
శుభకృత్ నామ సంవత్సరం
మార్గశిర మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి
అంశం:-- లోక కల్యాణం
శీర్షిక:-- ఆకుపచ్చ వసంతం
ప్రక్రియ:--వచన కవిత్వం
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
తారీఖు:--6/12/2022
వారం:-- మంగళవారం
చరవాణి:--7569820872
క్షీరసాగర మథనంలో ఉద్భవించినహాలాహలం, అమృతంలా, విజ్ఞాన శాస్త్ర పరిశోధనలోనూ జనిస్తాయి
కల్యాణం,వినాశనం మానవ మేధస్సునుంచి, ప్రపంచాన్ని గడగడలాడించినకరోనావైరస్లా
రోగాన్ని కట్టడి చేసే ఔషధంలా
విజ్ఞానం సక్రమ మార్గంలో ఉపయోగిస్తే కల్యాణం
అక్రమ మార్గంలో ప్రయోగిస్తే వినాశనం
చెట్లను నరుకుటమాని పచ్చదనాన్ని పెంచడం
ప్లాస్టిక్ వాడకం నిషేధం లోక కల్యాణంలో ఒక భాగమై తే
పగలూ,ప్రతీకారాల నిర్మూలన
మమతా మానవతల విజృంభణ
గుండె నుంచి గుండెకు కట్టే అనురాగలతల వంతెన
ఆత్మీయతా భావప్రసరణ రెండవ భాగం
పచ్చని ప్రకృతి ప్రసాదించు పరిశుభ్ర పవనాలు ఎంత ఆరోగ్యం!
ప్రశాంత హృదయాల సుమతావీపరిమళాలు ఎంత మనోహరం!
విత్తు నుంచి చెట్టు పెరిగి వటవృక్షమై పచ్చదనాన్ని పంచినట్లు,
ప్రతి ఇంటినుంచీ మానవతా బీజాలు మొలకెత్తి ఆరోగ్య
కరమైన వాతావరణంలో పెరిగిన పెద్దవైనప్పుడు ప్రతి
మనసూ ఆకుపచ్చ వసంతమై లోక కల్యాణం జరుగుతుంది.
18.
కవితా గానం
మార్గశిర మాస పౌర్ణమి పోటీ కొరకు
అంశం*లోక కల్యాణం
శీర్షిక*ఆత్మశుద్ధి
నరజన్మ హరిహర చైతన్య రూపం
సౌజన్యశీలమైన సత్ప్రవర్తనే జీవితం
ఈ భువిలో నరజన్మ పుణ్యచరితం
మట్టిలో పుట్టి పెరిగిన శ్రీధర్మతేజం
సుకర్మయోగమే పరోపకారహితం
అద్రోహచింతనే పంచభూతాత్మకత్వం
ఇచ్చిన మాట పొల్లు పోకుండా
సూర్య తేజోమయమే మనిషి నడక
ధర్మం దారితప్పినపుడే
గుణహీన అవలక్షణాలు ప్రవేశం
అవతార మూర్తి ఆ సర్వేశ్వరుడే
అభయ ప్రధాతగా ఎక్కడికక్కడా
శిష్టరక్షణ దుష్టశిక్షణకై ఆగమనం
సిరికింజెప్పడు
శంఖచక్రగధాయుధంబులను ధరించడన్నట్లు ఆపదలో
ఉన్నవారిని ఆదుకునే విశ్వామిత్ర
స్వరూపాలే ఆపద్భాందవులు
మోహం వలలో లోభం కాటుకు
మాయాబజార్ చిత్రమే ఈ జగం
దేవుడంటే ఎవరోకాదు
మాటకు కట్టుబడి బతికే సత్యవంతులే
రాక్షసులంటే ఎక్కడ్నుంచో రారు
మనలోని వారే వాగ్దాన భంగం కలిగించే క్రూరులే
సత్యవంతుల అభయహస్తమే
దుర్జనత్వాలను దునుమాడే ఆయుధం
వారి పవిత్ర గొడుగు నీడే
అన్యాయాలకు అక్రమాలకు గురైన
వారిని కాపాడే పెన్నిధి
పూవులోంచి వెలువడే పరిమళమై
*మానస* హృదయానందంలో సంచరిస్తూ
సత్యసంధతలో తపస్సుగా
జీవించడమే అసలైన లోక కళ్యాణం
నరజన్మ హరిహర చైతన్య రూపం
సౌజన్యశీలమైన సత్ప్రవర్తనే జీవితం
ఏడెల్లి రాములు ✍️
ది*06*12*2022(21*25)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
19.
లోక కల్యాణం
...........................
గురుసాముల వాగ్భూషణం లోకకల్యాణం
ఎవరి ప్రపంచం వారిదే, ఎవరి క్రతువులు వారివే
కులాలు, మతాలు విచ్చుకున్న చోట మారుతాయి రూపాలు
లోకం అంతుచిక్కని బ్రహ్మ పదార్థం
తెలిసింది గోరంత, తెలువంది శరీరమంత
లోకమంటే విశ్వ జీవనం
విచ్చుకున్న జ్ఞానం కంటే చిక్కుముడులే ఎక్కువ
భూలోక కల్యాణం చేస్తున్నాయి
పక్షులు పండ్లు తిని విత్తుల్ని భూమ్మీద జార విడిచి
చినుకులు మట్టిని కౌగలించుకుని ఎన్నింటికో జన్మనిస్తూ
చెట్లు చచ్చినా పనికొస్తున్నాయి సామాగ్రిగా మారుతూ
పనికిరాదనుకున్న గడ్డి తిని పాలిస్తాయి పశువులు
పెద్దలేం చేస్తున్నారు సామీ
అగ్గికి ఆహుతి చేస్తున్నారు చెట్లు, ఆహార పదార్థాలు
అడవులకు అతీగతీ లేకుండా
గనులను డొల్ల చేస్తూ, దోచుకుంటూ, దోచిపెడుతూ
మనమేం చేస్తున్నాం మౌనం పాటిస్తున్నాం
గుడ్లప్పగించి చూస్తున్నాం, అందిన కాడికి ఇల్లు చేరుస్తున్నాం
ప్రశ్నలేం చేస్తున్నాయి బజారుకెక్కుతున్నాయి
కన్నీటితోపాటు రక్తాన్ని కారుస్తున్నాయి
జైళ్లలో మగ్గుతున్నాయి, ఉరితాళ్లను ముద్దాడుతున్నాయి
లోక కల్యాణ భాషణాలు మైకుల్లో మోగుతున్నాయి
పద మన దారి ఎటో ఎంచుకుందాం
...............................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేది..07-12-2022
20.
పౌర్ణమి కవితల పోటీకి వచనకవిత
అంశం : లోక కళ్యాణం
శీర్షిక : పచ్చని సామ్రాజ్యం
చిన్న విత్తులో నుంచి అంకురించి
వృక్షంగా రూపుదాల్చి
శాఖోపశాఖలుగా విస్తరించి
అనేక పక్షిజాతులకు గూడు కల్పించి
ఆశ్రయించిన వారికి నీడనిస్తూ
ఆకలిదప్పులు తీరుస్తూ
ప్రాణవాయువును అందించి ప్రాణాలను నిలుపుతూ
తన ఊడలను ఉయ్యాలలుచేసి పిల్లలను ఊపుతూ
పుట్టుక నుంచి గిట్టుట వరకు మనిషికి తోడుంటూ
హరితవర్ణపు చీరను పుడమితల్లికి బహుకరిస్తూ
ప్రకృతికాంత నుదుటన సింధూరమై మెరుస్తూ
పడుతుల పాదాలకు పారాణియై నిలుస్తూ
చల్లగాలులతో వరుణుడిని ఆహ్వానిస్తూ
కర్షకుని కష్టాలను కడతేర్చుతూ
విశ్వమంతా పచ్చని సామ్రాజ్య విస్తరణకు పూనుకుంటూ
కరువుకాటకాదులను నివారిస్తూ
సర్వేజనా సుఖినోభవంతని దీవిస్తూ
వనదేవతలు భూలోక విహారం చేసేలా చేస్తున్నాయి వృక్షాలు!
లోక కళ్యాణం కొరకు
తలకొక మొక్కను నాటుదాం
నాటిన మొక్కను వృక్షమయ్యే వరకు సంరక్షిద్దాం!
====================
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి : 7416638823
**************************
హామీపత్రము :
పై వచనకవిత నా స్వీయరచనే నని, ఇది దేనికీ అనువాదం, అనుసరణ కాదని, ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ, ప్రసారం కాలేదని హామీ ఇస్తున్నాను.
21.
ముడుంబ తిరువేంకటాచార్యులు
మానుకోట (నివాసము & జిల్లా)
మార్గశిరపౌర్ణమి కవితాగానం
అంశం: లోకకళ్యాణం
శీర్షిక:భారతీయసంస్కృతి - లోకకల్యాణస్ఫూర్తి
అనాదిగా ఆర్యావర్తం
త్యాగధనుల కన్నతల్లి
తపోధనుల కల్పవల్లి
ధర్మస్థాపనకై తపించిన ఘనులెందరో!
లోకకళ్యాణానీకై నినదించిన మునులెందరో!
అందరిలోన ఆత్మ ఒకటేనని
అద్వైతమే శరణమని నినదించిన శంకరులు
గోపురమెక్కి లోకులందరికీ తిరుమంత్రము చాటిన రామానుజులు
* * * *
దుష్టదైత్యుని దునుమాడగ దేవరాజుకుతన వెన్నెముకనిఛ్చిన దధీచి
మహిషాసుర మర్దనకై ఒక్కటైన దైవశక్తి
అవనీజనులను పీడించే ప్రతి దురాత్ముని సమయింపగ అందరొక్కటై నిలవాలన్నస్ఫూర్తి
* * * *
పక్షిరక్షణార్థం తన దేహాన్ని
అర్పించిన 'శిబి'జీవకారుణ్యమూర్తి
ధర్మరక్షణకై ప్రాణాలొడ్డిన యశోధనులెందరో! ధరణీజనులహితంకోరి తపమాచరించిన మహర్షులెందరో!
'ధర్మగ్లాని' సంభవించిన ప్రతిసారీ
మానవుడై ప్రభవించే అవతారమూర్తి
సాటిజీవి ఆకలితీర్చగ
తనప్రాణాలే లెక్కించని రంతిదేవుడు
సర్వజీవుల0దు ఆత్మ ఆకలి
యొక్కటే అను భావము
'సర్వప్రాణి సేవయే సర్వేశ్వరునిసేవ 'యని బోధించిన తత్వం
* * * *
అడిగిన లేదనకుండా ఇచ్చిన దానకర్ణులెందరో!
అరిషడ్వర్గాలు పాలబడక
నిరుపమ మానవతా స్పూర్తితో
అశేష జనావళీ కల్యాణార్థమై తమ
ధన మాన ప్రాణాలను సైతం గణింపక
జనతకు స్ఫూర్తిగా నిలుస్తూ
' అందరూ బాగుండాలి వారిలో మనమూ వుండాలి ' అని చాటి చెప్పిన మహానుభావులందరికీ వందనాలు.
అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ 'లోకకల్యాణానికి ' భారతీయతయే స్ఫూర్తి .
********* ********** ********
ఇది నా స్వంతరచన. ఇతర రచనలకు అనుకరణ అనుసరణ అనువాదము కాదు.
Comments
Post a Comment