నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**************************
కవి వరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
3.జోషి పద్మావతి గారు
4.కొంపెల్లి రామయ్య గారు
5.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
6.డా.నాగలక్ష్మి తంగిరాల గారు
7.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
8.మద్ది పుల్లారావు గారు
9.గంగపురం శ్రీనివాస్ గారు
10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
11.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
12.గొర్రెపాటి శ్రీను గారు
13.మొహమ్మద్. అఫ్సర వలీషాగారు
*************************
సమీక్షలు
***************
ప్రథమ బహుమతి పొందిన "అనుభవిద్దాం శిక్ష" అనే కవిత ఎత్తుగడతో అంశానికి సరిగ్గా సరిపోయింది. కవిత ఆద్యంతమూ ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా సాగింది. ధర్మబద్ధంగా జీవించడం మంచిదే, కానీ అధర్మాన్ని ఎదిరించకుండా మౌనం వహించడం తప్పనీ, అందుకే భీష్మాచార్యులు అంపశయ్యపై పరుండవలసి వచ్చిందనీ, అటువంటి స్థితిలో ఆయన నిర్మలమైన మనస్సుతో ధర్మరాజుకు మానవాళి తరించే మార్గదర్శకాలు చెప్పేరనీ వర్ణించారు. ఎవరమైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించవలసిందేనని మంచి సందేశమిచ్చేరు కవి తిప్పావజ్ఝల నరసింహ మూర్తి గారు.
***********"
ద్వితీయ బహుమతి పొందిన పది మంది విజేతల కవితల సమీక్షలు :
*1 శ్రీమతి మొహమ్మద్ అఫ్సర వలీషా గారు*
*శీర్షిక :. సజీవ మంత్రాలు*
" ఉషః సంధ్యలతో పయనిస్తూ.." కవితాత్మకమైన ఎత్తుగడతో కవితావస్తువును సూచిస్తూ ప్రారంభమయిన ఈ కవిత ఆద్యంతమూ అనాదిగా ఆంక్షల అంపశయ్యపై , పద విన్యాసాల సుప్రభాతాలే సజీవ మంత్రాలుగా బతుకుతున్న అతివల దైనందిన జీవన క్రమాన్ని ఎంతో బాగా వర్ణించారు. " దశల వారీగా దిశలు నీవు మారినప్పుడల్లా" వంటి పంక్తులు బాగున్నాయి. కవిత ఇంకొన్ని పంక్తులు ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
[
2 *శ్రీమతి దారల విజయకుమారి గారు*
*శీర్షిక : ఇంకా దక్షిణాయనం లోనే*
"భావ వ్యక్తీకరణ లను బందీలుగా చేసి...... లెక్కలేనన్ని సార్లు ఆంక్షల అంపశయ్యపై ఒరిగిన అనుభవాలే" గల మహిళలు ఇంకా ఎంతకాలం దక్షిణాయనంలో మగ్గిపోవాలి అంటూ నిరసన స్వరంతో ప్రతీకాత్మకంగా వ్రాసారు కవయిత్రి.
హృదినేలమాళిగ, పోగుపడిన వంటి తెలుగు పదాలు కవితలోని సారాంశాన్ని మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. అతివల భావస్వేచ్ఛను కోరుతున్న ఈ కవిత బాగుంది.
3 *శ్రీ ఏడెల్లి రాములు గారు*
*శీర్షిక : గొలిముడి ముళ్ళు*
మట్టి పరిమళాలు వెదజల్లుతూ, అన్నదాతల జీవితాలకు అద్దం పట్టే ఏడెల్లి రాములు గారి కవితల కొక మచ్చుతునక ఈ కవిత. ఏడాదంతా కష్ట నష్టాల కోర్చి పండించిన పంటపై ఆంక్షల వలను అంపశయ్య గా బాగా చిత్రించారు కవి. ఆయన అన్నట్లు, సరియైన మద్దతు ధరలు లేక ధాన్యం అంపశయ్యపై విశ్రమిస్తోంది. కర్ణుడు కవచకుండలాలు ఒలిచినట్లు నాగలీ ఎద్దెవుసం మూలకెల్లినయి అంటూ వాస్తవాలను వర్ణించారు.
వరి ఉరై, రాజ్యం అల్మరా వంటి రూపకాలంకారాలు, గొలిమిడి ముళ్ళు, వలపోత వంటి గ్రామీణ తెలుగు పదాలు కవితకు పుష్టి నిచ్చాయి.
*శ్రీమతి టేకుమళ్ళ విజయలలిత గారు*
*శీర్షిక : అంపశయ్యపై శయనం*
నిజం, కవయిత్రి అన్నట్లు, సమస్త ప్రకృతినీ అందినంత దోచుకుని, విశ్వ విలయానికి కారణభూతులమై , సూక్ష్మాతి సూక్ష్మ జీవి చెరలో పడి మానవజాతి మొత్తం అంపశయ్యపై పడుక్కున్నాం, ముప్పుతిప్పలు పడుతున్నాం. జీవచ్ఛవాలు, మరణమృదంగం, నరరూప రాక్షసులు వంటి పదాలతో వర్తమాన పరిస్థితిని బాగా చిత్రించారు.
6 శ్రీ బొప్పెన వెంకటేష్ గారు*
*శీర్షిక : విరిగిపోతున్న శ్వాసలు*
'విరిగిపోతున్న శ్వాసలు' అనే శీర్షిక అంశానికి సరిగ్గా సరిపోయింది. మహమ్మారి బారిన పడిన శరీరం మృత్యువాసనలను పీల్చలేక, మానలేక అంపశయ్యపై ఉన్నట్లు మాటల మేకుల్ని భరిస్తూ ఉన్నామని ప్రస్తుత పరిస్థితిని కవిత్వీకరించి చెప్పారు. " కుట్లూడిన అతుకుల బొంతను అవతల పారేయాలని అందరికీ ఆరాటమే" , "నీ నీడ కూడా నిన్ను చూసి జాలిగా దూలానికి వేలాడుతుంది" అనే వాక్యాలు చదువుతుంటే కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి.
*శ్రీ తాతపూడి సోమశేఖర శర్మ గారు*
*శీర్షిక : పార్థుడు నిర్మించిన విచిత్ర శయ్య*
కవి అన్నట్లు, మహా మేధావి, జ్ఞాని అయిన భీష్మాచార్యునికి ఆయన కోరుకున్నట్టుగా పార్థుడు నిర్మించిన విచిత్ర అంపశయ్య నాటి లాగే, నేడూ కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
భీష్మ చరిత్రను క్లుప్తంగా అయినా సమగ్రంగా చిత్రించారు కవి.
*శ్రీ మద్ది పుల్లారావు గారు*
*శీర్షిక : బహుశః వ్రాయడం మర్చిపోయి ఉంటారు కవి.*
పాప పుణ్యాల ఖాతరు లేక అవాంఛిత కార్యాలు చెయ్యడం వల్ల మనుజులు అంపశయ్య శయన రూపంలో శిక్షను అనుభవిస్తారనీ, భీష్మాచార్యులంతటి వారికి కూడా తప్పలేదనీ అంటారు కవి. దుర్మార్గాలను దరి చేరనీయనివారికి
అంపశయ్య వేదనలు తొలగిపోతాయనీ, అందరమూ భగవంతుని శరణుగోరి స్థితప్రజ్ఞతను అలవరచుకోవాలని మంచి సందేశమిచ్చేరు కవి పుల్లారావు గారు.
*శ్రీ గొర్రెపాటి శ్రీను గారు*
*శీర్షిక : అంపశయ్యపై సామాన్యుడు*
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తరుగుతున్న ఆదాయాల కారణంగా ఇంటిల్లిపాది కోర్కెలు తీర్చలేని నిస్సహాయ స్థితిలో అంపశయ్యపై భీష్మునిలా బేలగా చూస్తున్నాడని నేడు దేశంలోని సామాన్యుని వాస్తవ పరిస్థితిని బాగా చిత్రించారు కవి. ఆర్ధిక తారతమ్యాలు తొలగిపోయేలా ఓ సరికొత్త విప్లవం వస్తేనే సామాన్యుడు అంపశయ్యపై నుండి లేచి నవ్య శకాన్ని సృష్టించగలడనీ, రేపటి భారత దేశం ప్రపంచానికి ఆదర్శం కాగలదనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మంచి సందేశమిచ్చేరు కవి.
*శ్రీమతి జోషి పద్మావతి గారు*
*శీర్షిక : జీవనం- కంటకప్రాయం*
నాడు ఫలాపేక్ష లేక ప్రతిన బూనిన భీష్మాచార్యులు స్వయంగా అంపశయ్యను కోరుకుని తరించితే, నేటి మానవుడికి స్వార్థ పరత్వపు సంకుల సమరాన అవినీతిని అరికట్టే యత్నంలో పట్టుపానుపు కూడా 'గుబుళ్ళ ముళ్ళు' పొడిచే అంపశయ్యగా మారుతుందనీ, వేదనకు గురి చేస్తుందనీ వాస్తవాలను చెప్పేరు. కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
*12 శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు*
*శీర్షిక : ముళ్ల పాన్పు*
ఆద్యంతమూ అలంకారయుతంగా, ధ్వనిపూరితంగా కవితను బాగా వ్రాసారు కవి అంజయ్య గారు. వాస్తవాలను చెప్పారు. చివరి భావగణం ఆర్ద్రంగా ఉంది. ప్రారంభం లో "తిన్నది తాగిందంతా చెమట రూపంలో" అన్నదానికీ, చివర్లో " కన్నీళ్ళతో కడుపు నిండుతోంది" అన్నదానికి పరస్పర వైరుధ్యం ఉందనిపించింది. శ్రమ పన్నీరు, నిద్రకుక్క వంటి పదాలు అర్థవంతంగా ఉన్నా సంస్కృత, తెలుగు పదాలను కలపడంతో కొంచెం కృత్రిమంగా అనిపించేయి.
*13 శ్రీ కోరాడ నరసింహారావు గారు*
*శీర్షిక : భారత యువత... విజయులు కావలె!*
కవితా వస్తువును నూతన కోణంలో నడిపించారు నరసింహారావు గారు. చుట్టుముట్టిన సమస్యల వల్ల అంపశయ్యపై భీష్మునిలా మన భారతావని తయారవకూడదనీ, అధర్మానికి కాపాడడానికి యత్నించిన భీష్ముని అంపశయ్యకు చేర్చిన అర్జనునిలా మన యువత
ధర్మ మార్గములో నడిచి, విజయులు కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసారు. కవిత నిడివి బాగా తక్కువగా ఉంది, ఇంకొంచెం పెంచి ఉంటే ఇంకా బాగుండేది
: *కె దేవికారాణి రత్నాకర్*
*శీర్షిక : మనిషిగా ఎదిగి...*
ఆద్యంతమూ కవితాత్మకంగా ఉండి, కవిత బాగుంది. కన్నె గులాబీకి స్వార్థపు ముళ్ళ చూపులు, కృషీవలుడికి అకాలవర్షం, శ్రామికులకు పీడనల శల్య సారధ్యాలే అంపశయ్య, మానవత అనే భీష్మునికి క్రౌర్యం అనే అంపశయ్య అంటూ వర్తమాన సమాజ పరిస్థితిని బాగా చిత్రించారు కవి.
ప్రతి పంక్తి కి ఎడమవైపున బ్రాకెట్ ఉంచే అవసరం లేదు, చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది దాని వల్ల. " మనిషిగా సమసి మహామనీషిగా పుట్టు" అంటూ మంచి సందేశమిచ్చేరు.
*15 గంగాపురం శ్రీనివాస్ గారు*
* *శీర్షిక :. పూలపాన్పు*
"తండ్రి కోసం తనను తాను త్యాగం చేసుకున్న మహోత్తముడయిన భీష్ముని చరిత్రను అలతి అలతి పదాలతో వర్ణించారు కవి. కవితను ముచ్చటైన భావగణాలుగా విభజించడం బాగుంది కానీ వాటిల్లో వాక్యం అసంపూర్తిగా ఉంది, తరువాతి భావగణంతో అన్వయం కూడా లేదు. ఈ పొరపాటును సవరించుకుంటే కవిత ఇంకా బాగుండేది.
*16 శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు*
*శీర్షిక : అంపశయ్యకు ఆవల*
భీష్మాచార్యులు అంపశయ్యపై శయనించి స్వచ్ఛంద మరణాన్ని కోరుకోవడానికి వెనుక గల కారణాలను, ఆయన సమగ్ర జీవిత చరిత్రనూ క్లుప్తంగా వర్ణించారు కవి.
కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది. అక్కడక్కడ టైపింగ్ పొరపాట్లు వచ్చేయి. మొత్తం మీద కవిత బాగుంది.
*17 ఆచార్య*
*అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు*
*జీవన్ముక్తి మీ సోపానం*
ధర్మక్షేత్రానికి ప్రతీక అయిన కురుక్షేత్రం లో అంపశయ్యపై స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్న మహనీయుడు, జీవన చరమాంకంలో కూడా మానవాళి జీవన్ముక్తి కై విష్ణుసహస్రనామ స్తోత్రాన్నందించిన పుణ్యశాలి అనీ భీష్మాచార్యుని గొప్పదనాన్ని వివరించారు కవి. వచనం పాలు ఎక్కువైందని అనిపించింది. అక్కడక్కడ టైపింగ్ పొరపాట్లు కూడా వచ్చేయి. చివరి పంక్తిలో వాక్యం పూర్తి కావడానికి ' దూరం చేసే' అని ఉంటే బాగుంటుంది. శీర్షిక లో మీ అనే అక్షరం పొరపాటున వచ్చి ఉంటుంది. మొత్తం మీద కవిత బాగుంది.
: *18డాక్టర్ నాగలక్ష్మి తంగిరాల గారు*
*శీర్షిక : అంపశయ్య*
బాణాల ములుకులు గుచ్చుకుంటున్నా విష్ణుమూర్తిని స్తుతిస్తూ పాండవులకు ధర్మాలను ప్రబోధించిన భీష్ముడు పూలపాన్పులా భావించి శయనించిన అంపశయ్య లాంటిదే మన జీవితం కూడా అంటారు కవయిత్రి. నేటి సమాజంలో మన జీవితం లోని ప్రతి దశా అంపశయ్య లాటిదేననీ, అయితే దానిని పూలశయ్యలా భావించుకుని కొన ఊపిరి వరకూ భగవన్నామ స్మరణ చేస్తూ జీవనయానం చెయ్యాలనీ అంటారు. కవయిత్రి భావన, సందేశం రెండూ చాలా బాగున్నాయి కానీ వచనం పాలు ఎక్కువైందని అనిపించింది, ఇంకొంచెం కవిత్వీకరించి ఉంటే ఇంకా బాగుండేది.
*19 దోసపాటి వేంకట రామచంద్రరావు గారు*
*శీర్షిక : జీవన్మరణ సమస్య*
"సగటు మానవునికే కాదు మేధాసంపన్నులకూ జీవన్మరణ సమస్య అంపశయ్య" అంటూ సరియైన ఎత్తుగడతో మొదలయింది కవిత. జీవనంలోని చివరి క్షణాలు తరతమ భేదాలు లేక
అందరికీ బాధాకరమే అని చెప్పడం బాగుంది, కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
[01/02, 4:25 pm] Lalita Sister:
*20*శ్రీ ఆళ్ల నాగేశ్వరరావు గారు*
*శీర్షిక : భీష్ముని మరణశయ్య*
" కోరుకున్నప్పుడు కోరిన విధంగా పరమాత్మునిలో ఐక్యమయ్యే వరసిద్ధితో అవతరించిన అవతారపురుషుడు భీష్ముడు" అంటూ అంశానికి తగిన ఎత్తుగడతో ప్రారంభించారు కవి. భీష్మాచార్యుని వ్యక్తిత్వాన్ని గురించి బాగా చెప్పేరు. అయితే, ఆయన తమ ఆఖరి ఘడియల్లోనే కాకుండా అంతకు ముందు కూడా చాలా సార్లు కౌరవుల అధర్మాలను సహించారు, చివర్లో అంపశయ్యను తనకు తానుగా ఏర్పాటు చేసుకోలేదు ఆయన ఆదేశం మేరకు అర్జునుడు ఏర్పరిచాడు. ఇలా కవితలో కథను చెప్పడంలో రెండు చిన్న పొరపాట్లు వచ్చేయి. మొత్తం మీద కవిత బాగుంది. కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
[01/02, 4:25 pm] Lalita Sister: *
*శ్రీ కొంపెల్లి రామయ్య గారు*
*శీర్షిక : నేటి చుక్కాని యువతరం*
సమాజానికీ, ప్రపంచానికీ దారి చూపించే చుక్కానిలా యువతరం ఉండాలి అనే ఉద్దేశంతో కవి తమ కవితకు ఆ శీర్షిక ఇచ్చేరని భావించవచ్చు , అయితే ఏ రంగాల్లో, ఎలా వారు దారి చూపించాలి అనే విషయం కూడా కొంచెం స్పష్టంగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. కానీ, అంతర్జాల మాయలో చిక్కి, నీతిమాలిన నిస్సిగ్గు జీవితంలో కొట్టుటుపోతూ జీవన్మరణ అంపశయ్యపై మూలుగుతున్న నేటి యువతరాన్ని మాత్రం కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. అన్యాయాలను తిప్పి కొట్టగల యువశక్తి నవ చైతన్యం తో ముందుకు సాగాలని మంచి సందేశమిచ్చేరు కవి.
[01/02, 4:25 pm] Lalita Sister:
*22 కుమారి/శ్రీమతి లలితా చండీ గారు*
* *శీర్షిక :. అంపశయ్య*
"అయోమయంలో ఆనవాలు కోల్పోతున్న వేద వారసత్వం" ఆంటూ వర్తమాన పరిస్థితుల పట్ల ఎంతో ఆవేదనతో అంశాన్ని క్రొత్త కోణంలో ఆవిష్కరించారు కవయిత్రి. నిజం, ఆమె అన్నట్లు, నాడూ,నేడూ కూడా మాతృభూమి, సంస్కృతుల పరిరక్షణ కోసం అంపశయ్యధారులై శ్రమించేవారున్నారు. " శిధిలాలలో శిలాశాసనాలు చూస్తూ" అనే పంక్తి అక్షరసత్యం. కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఇంగ్లీష్ పోయెట్రీ లో stanzas లా కవితను కొన్ని భావగణాలుగా విభజించుకుని వ్రాస్తే బాగుంటుంది.
*23 డాక్టర్ నాయకంటి నరసింహశర్మ గారు*
*శీర్షిక : అంపశయ్య*
కవిత ఆద్యంతమూ కవితాత్మకంగా నడిచింది. సమాజంలో కొందరి జీవితం అవమానాలకు గురియై, నిరాశానిస్పృహలతో ముందుకు సాగక అంపశయ్య వంటి చరమదశకు చేరుకుంటుందనే వాస్తవాన్ని ఎంతో ఆర్ద్రంగా చెప్పేరు,
కానీ, కారుణ్యానికి, కాఠిన్యానికి, వైఫల్యాలకు, వైరాగ్యానికి దిక్సూచి అంపశయ్య అనడం లో పరస్పర విరుద్ధ భావనలు కనిపించి, వాక్యం సరిగా లేదనిపించింది.
*24 శ్రీ అపరాజిత్ రెడ్డి గారు*
*శీర్షిక : అక్షరాల అంపశయ్య*
ధ్వని పూర్వకంగా, ప్రతీకాత్మకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆలోచనల వేడిపై సతమతమౌతూ, కేవలం చదువుల లోకంలోనే బతుకుతూ తల్లిదండ్రులకూ, బంధుమిత్రులకూ దూరంగా ఏకాకుల్లా అక్షరాలు అనే అంపశయ్యలపై పడి ఉన్న దైన్య పరిస్థితిని కవి చిత్రించారు. కొంచెం విషయ స్పష్టత ఉంటే ఇంకా బాగుండేది.
*23 శ్రీమతి తరణికంటి సూర్యలక్ష్మి గారు*
*శీర్షిక : భీష్మ ఘనత*
ఘనుడైన భీష్మాచార్యుని చరిత్రను సమగ్రంగా చిత్రించారు కవయిత్రి.
అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచి ఉండి ఆ రోజున పరమాత్మలో ఐక్యం అయారనీ ఆ రోజును భీష్మ ఏకాదశి అంటారనీ మరొక విశేషం చెప్పేరు.
కవిత బాగుంది కానీ వచనం పాలు ఎక్కువైందని అనిపించింది.
*25 శ్రీమతి సింహాద్రి వాణి గారు*
* *శీర్షిక : విష్ణుసహస్రనామ జననం*
భీష్మాచార్యులు అంపశయ్యపై శయనించవలసిన పరిస్థితులను వివరించి, సకల శాస్త్రాలు తెలిసిన భీష్ముడు ఆ సమయంలో సర్వ వ్యాపి, సర్వజ్ఞుడు, సర్వ శక్తి సంపన్నుడు అయిన విష్ణు మూర్తిని స్తుతిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పిన విశేషాన్ని చెప్పారు. కవిత బాగుంది కానీ వచనం పాలు ఎక్కువైందని అనిపించింది.
: *26 కవిత వెంకటేశ్వర్లు*
* *శీర్షిక : అంపశయ్య*
ధర్మం రెండు పాదాల నడిచిన ద్వాపర యుగంలో భీష్మాచార్యులు ఉత్తరాయణము కొరకు ఎదురు చూడగలిగారు కానీ పరిస్థితులు మారాయనీ, ధర్మం ఒంటి కాలిపై నడుస్తున్న ఈ కలికాలంలో మంచి మంచులా కరిగిపోతోందనీ, సద్గుణాలన్నీ అంపశయ్యపై వేదనను అనుభవిస్తున్నాయనీ ప్రస్తుత విషాద సమయాన్ని సరిగ్గా చిత్రించారు కవయిత్రి. సందేశం ఇంకొంచెం స్పష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. వచనం పాలు ఎక్కువైందని కూడా అనిపించింది.
[* *27వేదాంతం సురేష్ బాబు గారు*
* *శీర్షిక : అంపశయ్య*
" దినదిన గండం నూరేళ్ళ ఆయువు" అంటూ సరియైన ఎత్తుగడతో ప్రారంభించి, అన్యాయాలు, అక్రమాలు మితిమీరిపోయిన నేటి సమాజంలో జీవచ్ఛవంలా బతుకు నీడుస్తున్న సామాన్యుని బతుకు మృత్యుశయ్య యైన అంపశయ్యగా మారిందని వాస్తవాలను చెప్పారు. కవిత నిడివి ఇంకొంచెం ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
*28 శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు*
*శీర్షిక :. అంపశయ్య*
అమేయమైన మేధో సంపత్తి, ఆత్మ విశ్వాసం ఉన్నా కూడా అధర్మాన్ని ఆపలేకపోవడం వల్ల అంపశయ్య పాలయ్యాడని చెప్పడం బాగుంది, కానీ, "మార్గ నిర్దేశం చేసే శాస్త్రాలు ఆచరణ చేయలేవు" వంటి వాక్యాల విషయంలోనూ, ఆఖరి భావగణం విషయం లోనూ కవి మరొకసారి ఆలోచించుకుంటే బాగుండునని అనిపించింది, పాత, క్రొత్త భావాలు, సాంప్రదాయాలు, నవ్య నూతన విధానాలు మొదలైన వాటిని గురించిన చర్చకూ, అంశానికీ ఎక్కువ సంబంధం లేదని అనిపించింది.
: *వనపర్తి గంగాధర్*గారు*
*శీర్షిక :. దైన్యం*
వర్తమాన సమాజంలో అన్ని రంగాల్లోనూ అలుముకున్న స్వార్థం, అవినీతి, అమానుషత్వాల వల్ల బతుకు భయంతో మానవుల ప్రాణం అంపశయ్యపై అల్లాడుతోందని, సామాన్యుల ఆశల వత్తులు మరణ మృదంగం మ్రోగిస్తూ, చీకటికి చిరునామాలు వెతుకుతున్నాయనీ కవి వనపర్తి గంగాధర్ గారు ఆవేదన వ్యక్తం చేసారు, వాస్తవాలను చిత్రించారు. కవిత బాగుంది.
*************"""
1. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
కవిత *
అంశం: అంపశయ్య
శీర్షిక:
"" బీష్ముని మరణశయ్య ""
కోరుకున్నప్పుడు
కోరిన విధంగా
పరమాత్మునిలో ఐక్యమయ్యే
వరసిద్ధితో అవతరించిన అవతారపురుషుడు భీష్ముడు !
ఆ జన్మ బ్రహ్మచారియై
ధర్మ నిష్టా పరాయణుడై
సత్య వాక్కు భూషణుడై
భాసిల్లిన కురువృద్దుడు భీష్ముడు !
మహిమాన్విత ధనుర్మాసంలో
ఉత్తరాయణ పుణ్య ఘడియల్లో
అంతిమ శ్వాస వదిలెందుకు
అప్పటివరకు నిరీక్షించేందుకు
తనకు తానుగా తన శరాలతో
ఏర్పాటు చేసుకున్న మరణశయ్యే ఈ అంపశయ్య!
తన ఆఖరి ఘడియల్లో
కళ్ళ ముందు జరిగే అధర్మాల్ని సహిస్తూ
అంపశయ్య పైనే శయనిస్తూ
శ్రీకృష్టునుని విశ్వరూపంను దర్శిస్తూ
ఉత్తరాయణ పుణ్య ఘడియల్లో
మార్గశిరపు ధనుర్మాసములో
ఐచ్చిక మరణాన్ని ఆహ్వానించిన మహనీయుడు భీష్ముడు!
2.
కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
ప్లవ నామసంవత్సరం
మార్గశిర మాస *పౌర్ణమి* నగదు పురస్కారాల కవితల పోటీకి...గానం
*అంశం... అంపశయ్య..*
శీర్షిక....... అంపశయ్య
..18..12..2021
***********************
విలువలు విడిచి మానవత్వం మరచి
నిండు సభలో
వలువలూడదీస్తుంటె... సశస్త్రులైనా, ... నిస్త్రాణ శిలలై వీక్షించిన వృద్ధ కిషోరాల
నిష్క్రియాపరత్వం
అమేయమైన మేధో సంపత్తి అచంచలమైన ఆత్మవిశ్వాసం పటుతర పరాక్రమ శక్తి
ధర్మనిరతి న్యాయ నిబద్ధత ఎన్నున్నా ఏమి లాభం ?? నిష్ఫలమే... అఘాయిత్యాన్ని నిలువరించే ప్రయత్నం కూడా చేయునపుడు.
అంపశయనం ఉచితాసనమే
ధర్మం నిట్ట నిలువు గీత కాదు
నిత్యం పారే సెలయేరు లాంటిది
విచక్షణే దానికి మూలాధారం
మార్గ నిర్దేశం చేసే శాస్త్రాలు ఆచరణ చేయలేవు
కాలక్రమంలో వాటి ఉపయోగం ఉద్దేశాలు ఉనికి
మారిపోతుంది...... పిందె,కాయ, పండు.... ముదిరి కుళ్ళిన మామిడి పండులా....
చిగురించిన మొలక శాఖోపశాఖలుగా విస్తరించి తనకు తానే భారమైనట్లు
ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు కూడా
సమాజంలో విపరీత ధోరణిలో ఎదిగి ప్రతిబంధకాలైనపుడు ,
నవ్య నూతన విధానాలను తనకు తాను ఈ సమాజం పురుడు పోసుకుంటుంది
వాటిని తిరస్కరించి పాత వాసనలతో
వాసము చేస్తు పాత క్రొత్త వాసి దెలియక వాసము పీకి వాసికెక్కిన వాసుల వాలకం
అంప శయ్య మీద భీష్మ పితామహుడిదే !!!
స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
18122021
3
జోషి పద్మావతి గారు
కవిత *
జీవనం-కంటకప్రాయం
*******************
అంపశయ్యపై అసువులు బాసినవాడు
అలనాటి భీష్ముడు.
సంపదకై ప్రాకులాడుతూ కంటకప్రాయమైన జీవనం గడిపేవాడు
నేటి మామానవవుడు.
ఫలాపేక్ష లేక ప్రతిన బూనిన ధర్మబద్ధుడికీరాత!
తరాలెన్నిమారినా యుగాలెన్ని గడిచినా
తరించాడతడు తరిగిపోని ఖ్యాతి చేత !
స్వార్థపరత్వపు సంకులసమరాన
వ్యర్థ ప్రేలాపనల వెగటు జీవితాన
కుళ్ళు కుతంత్రాలతో నిండిన కుత్సితసమాజాన
అవినీతిని అరికట్టబోయే మర్త్యుడు
మరో భీష్మాచార్యుడైతే
జీవచ్ఛవంలా పరుండిన పట్టుపానుపైనా
గబుళ్ళ ముళ్ళు పొడుస్తూ కాయాన్ని గాయపరిచే అంపశయ్య కాదా!
అహర్నిశలూ అలుగుల తాకిడితో తనువు గాయపడిపోదా!
___________________
4.
కొంపెల్లి రామయ్య గారు
కవిత *
అంశం:అంపశయ్య
శీర్షిక: నేటి చుక్కాని యువతరం...!
బంధాలు అనుబంధాలను చీకటి దుప్పటిలో కప్పి
వేళా పాళా ఆకలి దప్పికలను కాల గర్భంలో కప్పేసి
అంతర్జాల మాయలో అశ్లీల చిత్రాల సుడిగుండంలో చిక్కి
నీతి మాలిన నిస్సిగ్గు జీవనదిలో కొట్టుకు పోతూ
నైతిక విలువలకు పాడే కట్టి
జీవన్మరణ అంపశయ్యపై
మూల్గుతుంది నేటి చుక్కాని యువతరం...!
బారుగా తెరిచిన బారులు రంగుల కలలను ఆహ్వానిస్తూ
చీమల బారుల్లా రేపటి తరాలకు దారులు వేస్తూ
చీకటి కమ్మేదాక మద్యం మత్తులో కండకావరం తో మూతలుపడుతున్న కళ్ల తో
వావివరసలు మరచి అఘాయిత్యాలకు పాల్పడుతూ
రేపటి అమ్మలకు ఘోరీ కట్టి
జీవన్మరణ అంపశయ్యపై
మూల్గుతుంది నేటి చుక్కాని యువతరం...!
నైతిక విలువలు నేర్పని నేటి పోటీ విద్యా వ్యాపారాల్లో
హద్దు అదుపు లేని కుటుంబ ముద్దు గారాబాల్లో
పబ్బులు క్లబ్బుల సిగ్గు ఎగ్గు లేని చిందుల్లో
భారతీయ సంస్కృతిని పాతర వేస్తూ
రేపటి సమాజాన్ని చితిలో పెట్టి
జీవన్మరణ అంపశయ్యపై
మూల్గుతుంది నేటి చుక్కాని యువతరం...!
అన్యాయం అవినీతి తీవ్ర వాదం తిప్పి కొట్టగల యువ శక్తి
దేశ భవిష్యత్తుకు వెన్నుముకగా నిలవాల్సిన నవశక్తి
కొత్త ప్రపంచానికి దారులు వేయాల్సిన భావితరం
వెన్నముద్దలా కరిగి
జీవన్మరణ అంపశయ్య పై మూల్గుతుంది నేటి చుక్కాని యువతరం...!
నిరంతరం ప్రవహించే సమాజ నది లోకి
కొత్త నీరులా యువతరంగం ఉరకలెత్తి
కొత్త పాతల మేలి కలయికతో
కొత్త రక్తం శరీరంలోకి ఎక్కిస్తూ
యువత నవ్య నూతన పరి పుష్టితో నవ్యత్వానికి ప్రగతి బాటలు వేస్తూ
అంతఃకరణ శుద్ధితో సకారాత్మకంగా ఆలోచిస్తూ
దేశాభవృద్ధికి అడుగులు వేస్తూ
ప్రపంచ పటంలో జయ కేతనమై ఎగరాలి...
జీవన్మరణ అంపశయ్యకు
చరమ గీతం పాడాలి నేటి చుక్కాని యువతరం...!
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
5
దోసపాటి వేంకట రామచంద్రరావు గారు
కవనజ్యోతి మార్గశిరమాస పౌర్ణమి కవితాపోటి
అంశం:అంపశయ్య
శీర్షిక:జీవన్మరణసమస్య
సగటుమానవునికే కాదు మేధాసంపన్నులకూ
జీవన్మరణసమస్య అంపశయ్య
తిధివారనక్షత్రాలను లెక్కించాల్సిందే
పాపాత్ములకూ పుణ్యజీవులకు
ఒకే కాలనిర్ణయం ఒకే నీరీక్షణాసమయం
భీష్మపితామహుడే అనుభవించాడు
శరాఘాతాలతో తనువంతా తల్లడిల్లినా
శేషజీవితపు తుదిపిలుపులందేవరకు
పరితపించక తప్పదుకదా
ధర్మవచనాలు వల్లించాల్సిందే
ఆకలిదప్పికలు తట్టుకోవాల్సిందే
మృత్యువాత పడినంతవరకు
మూలుగుతూ పడివుండాల్సిందే
ధర్మాధర్మవిచక్షణుండదు
న్యాయాన్యాయాల తూకముండదు
పదవులు హోదాలు పనిచేయవక్కడ
అదోక అవసరసమయ వేదిక
వేదనలు రోదనలు తప్పవు
వేకువలు రాత్రులు గడవాల్సిందే
ఓదార్చేవారుండరు
బాధతీర్చేవారుండరు
అర్జునిడిలా దప్పికతీర్చేవారు రావాల్సిందే
ఆఖరినిముషంలో ధర్మసూత్రాలు వల్లించాల్సిందే
అదే అంపశయ్య!
ఇది నాస్వీయరచన.
6.
డా.నాగలక్ష్మి తంగిరాల గారు
కవిత *
అంశం అంపశయ్య:
అంపశయ్య అనగానే అంద రికీగుర్తొస్తుంది
భీష్మ పితామహ అంతిమ యాత్ర
కురుక్షేత్రం లో యుద్ధంచేసి అర్జునుడి
బాణాలతో చేసిన అంపశయ్య పై ఒరిగాడు
బాణపు ములుకులు గుచ్చుకుంటున్నా
ధర్మాలు బోధించాడు పాండవులకు
విష్ణువుని స్తుతించాడు సహస్రనామాలతో
ఆయనకి అంపశయ్య పూల.పానుపేఅయ్యింది
మానవ జీవిత కాల చట్రం కూడా
అంపశయ్యే అవుతుంది ఆలోచిస్తే
పుట్టిన మొదలు కడ తేరే దాకా
పసిపాపడి నుండి పడుతూ లేస్తూ
తంటాలు పడుతూ నే ఉంటాడు
అప్పుడు భూమియే వాడికి అంపశయ్య
బడిలోకి వెళ్లి చదివేటప్పుడు
హోంవర్క్లు పరీక్షలు అంపశయ్యలే
కాలేజ్ చదువు పూర్తి చేసి వచ్చాక
ఉద్యో గాల వేటలో ఇంటర్వ్యూల అంపశయ్య
ఉద్యోగ జీవితం అనుక్షణం అంపశయ్యనే
గుర్తు చేస్తుంది
వైవాహిక జీవిత పు అంపశయ్య ఎన్నో ఒడి దుడుకులు పిల్లలు ,చదువులు, పెళ్లిళ్లు పూల బాణాలు ముళ్ల బాణాలు కలసిన అంపశయ్య
భాద్యతలు తీరాక ముసలితనపు వ్యాధుల అంపశయ్య
చివరిగా జీవుని అంతిమయాత్ర కూడా కష్ట భూ ఇష్ట మయిన అంపశయ్యేఅందుకే
భీష్ముని లా జీవితపు అంపశయ్య పై
సదా భగవన్నామ స్మరణ తోనే సాగించాలి పయనం
అప్పుడా జీవితం పుష్పబాణాల అంపశయ్యే అవుతుంది
: 7.
కవిత *
ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
శీర్షిక:-జీవన్ముక్తి మీ సోపానం
మహాభారతంలో కురుక్షేత్రం
ధర్మక్షేత్రమునకు ప్రతీక
ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది
మహాభారతం లో భీష్ముడు పూజ్యుడు
మరణాన్ని కావలన్నప్పుడు కోరుకునే మహనీయులు
ఆడిన మాట తప్పక తండ్రి కొరకై అవివాహితుడై
కురువంశ అభివృద్ధికి తోడ్పడిన ధర్మాత్ముడు
అర్జనునిచే శరములతో నిర్మింపబడిన
అంపశయ్య పై పరుండి స్వయం మరణము కొరకై
ఎదురుచూస్తు మానవాళి కి ఉపయోగపడే
జన్మసార్ధకత ను చేకూర్చే విష్ణు సహస్రనామ స్తోత్రము ను అందించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొంది అందు ఈశ్వరునిచే
పార్వతితో బాటు మానవాళి కి జీవన్ముక్తి కి
దోహదపడే తారక మంత్రం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
చెప్పి లోకకల్యాణం చేసిన మహనీయులు
అంపశయ్య పై నుండి పరమాత్మలో ఐక్యమై
జీవిత చరమాంకం లో కూడా పరమాత్మ
ధ్యానమును వీడక కర్తవ్య నిర్వాహణ
ముఖ్యమని తెలియచేసినపుణ్యశీలి
అందుకే అంపశయ్య అరిషడ్వర్గాలను దూరచేసి
జీవన్ముక్తి కి సోపానం.........!!
8.
మద్ది పుల్లారావు గారు
కవిత *
జీవిత ప్రస్థానమంతయు మనుజులు
పాప,పుణ్యముల ఖాతరు చేయక
పరోపకార భావనలను విడిచి
గడించగలరు పదవులను,సొమ్ములను
తన వారిపై గల అవ్యాజ్య ప్రేమను చంపుకోలేక
అవాంచిత కార్యములెన్నియో చేయుచుండు
భీష్ముడంతటివాడు చేసిన బాసను మీరలేక
పాంచాలికి జరిగిన పరాభవమును
నిరోధించలేకపోయె నాడు
ఆ పాప ఫలము కట్టి కుడిపి
చివరి దినములలోన అంపశయ్య పాలయ్యె
మంచిగంధం లాంటి మానవత్వం
మానవులకు అలంకారం కావలె
మితిమీరిన ఆశా,పాశాలకు బంధీలయిన
అంపశయ్యె మనిషికి అంతిమయాత్ర
చావు,పుట్టుకలు జీవితానికిరుగట్లు
నిత్యప్రస్థానం తప్పదు మృత్యుతీరం చేరేదాకా
జీవనయానము లోన నియమబద్దులగుచు
దుర్మార్గాలను దరిచేరనీయని వారికి
పరంధాముడు ముక్తినిచ్చు
అంపశయ్య వేధనలు తొలగిపోవు
భగవంతుని శరణుగోరి
స్థితప్రజ్ఞతను అలవర్చుకొనుచు
విశ్వశ్రేయస్సును కాంక్షించినచో
మానవుడే మాధవుడు గదా!
9.
కవితా గానం
గంగాపురం శ్రీ నివాస్ గారు
మార్గశిర పౌర్ణమి పోటీలు
అంశం: అంపశయ్య
తేదీ: 19.12.2021
"పూలపాన్పు"
°°°°°°°°°°°°°°°°
తండ్రి కోసం తనను తాను
త్యాగం చేసుకున్న మహోత్తముడు
కనీవినీ ఎరుగని రీతిలో
భీషణమైన ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు
దేవతలనే అచ్చెరువొందించిన దేవవ్రతుడు
వంశోద్ధరణ అవకాశం వచ్చినా
చిరునగవుతో తిరస్కరించి
దేవరన్యాయం సూచించిన న్యాయవేత్త
అరివీర భయంకరులను
గడగడలాడించిన గాంగేయుడు
ఓటమి ఎరుగని ధీరుడు
వెన్ను చూపని శూరుడు
ప్రతిజ్ఞా పాలనకై అధర్మం వైపున్నా
ధర్మమే జయించాలన్న తపనకై
శిఖండిని ముందుంచి కొట్టాలని
ఆయువు రహస్యం అడగ్గానే చెప్పి,
అర్జునుడి వీరత్వానికి వన్నెలద్దిన ఆర్యుడు!
ఇచ్ఛామరణ వరంతో
అంపశయ్యపైనే సేదదీరిన అష్టవసువు
రాజనీతి, పాలనాదక్షతను
పాండవులకు బోధించిన పావనుండు
ఉత్తరాయణ పుణ్యకాలంలో
శాపవిమోచనం చేసుకున్న గంధర్వుడు!!
కురుక్షేత్ర సంగ్రామంలో
సర్వసైన్యాధ్యక్షునిగా ఏకచక్రాధిపతిగా
తిరుగులేని సమరం సాగించి
ధర్మమే జయించాలని యోచించి
పార్థుని శరాపరంపర శయనమైన అంపశయ్యపై ఆనందంగా సేదదీరి
భరతవంశ కీర్తికి సొబగులద్దిన భారతోత్తముడు!!
10
తాతపూడి సోమ శేఖర శర్మ గారు
అంశం..అంపశయ్య
శీర్షిక.. పార్ధుడునిర్మించిన విచిత్రశయ్య
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
మహాభారతంలో మహోన్నతమహామేధావి
ముందే భవిష్యత్తు తెలిసిన గొప్ప మహాజ్ఞాని
మున్ముందు జరిగే పరిణామాల ఆలోచనాశైలి
మంచిగామార్చే ప్రయత్నంలో తెలివైన రాజఠీవి
మహారాజుశంతనునికై తనజీవితాన్నిఅంకితంచేసినజీవి
దేవవ్రతుడు అతని నామధేయం
గాంగేయుడు తల్లిసంక్రమణ నామం
మహాభారత వీరపరాక్రమం ఆయుధం
కౌరవపాండవులపితామహుడుగా సాఫల్యం
పితృదేవునిసుఖశాంతులకై భీషణమైనప్రతిజ్ఞ
సవతితల్లికుమారునిరక్షణకై తన త్యాగనిరతి
ముల్లోకాలు హారతిపట్టిన మహాగొప్ప ఘనత
దేవతలు పుష్పవర్షంకురిపించిన మహనీయత
దేవవ్రతుడని భీష్ముడుగా దేవతలుదీవించినవేళ
భారతయుద్దాతంవరకు చిరంజీవిగానిలిచినవేళ
పాండవపక్షపాతిఐనా కౌరవులసేనాధ్యక్షునిపదవి
అర్జునునిచేతిలోవీరమరణంపొందాలనే అతనిఆసక్తి
పార్ధుని బాణాలతో భీష్మపితామహునికి శర తయారీ
సేదతీర్చిన ఆఖరిపోరాటమైన వారుకోరుకున్న అంపశయ్య
ఆనాటికి ఈనాటికి అందరికీ గగుర్పాటైన భయానక దృశ్యమే
ఆనాడు భీష్మ పితామహుడు కోరుకున్న ఆ విచిత్రఅంపశయ్య
హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11.
సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
అంపశయ్యకు ఆవల:
మహాభారతంలో భీష్మ చరితం
అంపశయ్యపై కోరిన మరణం!
శంతన గంగాదేవిల అష్టమ సుతుడు
భీష్మాచార్యుడు
దంపతులిరువురి షరతు మేరకు భీష్మ
జన్మనిచ్చి గంగాదేవి వదిలి వెళ్ళిపోయె
సత్యవతిని ద్వితీయ సతి పెంచే
ఆమె జనకుని ఆంక్ష రాజ్య కాంక్ష నిర్జించి
బ్రహ్మచర్యం ఆచరించిన భీష్ముడు
సత్యవతిని శంతనుడు పరిణయమాడగ
చిత్రాంగదుడు విచిత్రవీర్యుడను పుత్రులిరువురు
కాశీరాజు పుత్రికాత్రయము నపహరించే
భీష్మాచార్యుడుii
అంబ అంబిక అంబాయను వారలు
అంబిక చిత్రాంరాగదుణ్ణి అంబాలిక విచిత్రవీర్యుణ్ణి అంబ శల్యుని వలచి దగాపడి
కడకు భాగస్వామిగా భీష్ముని వేడుకొనగా
ప్రతిన బూని బ్రహ్మచారిగా తిరస్కరణ
అంబ మరణించి శిఖండిగా జన్మెత్తి
అర్జునుడు శరపరంపరతో శయ్య కూర్చె
స్వీయ మరణం లేక స్వచ్ఛంద మరణం
పితృవాక్య వరం భీష్మ ప్రతిజ్ఞా
యుద్ధం తిలకించే ఈచ్ఛాపూర్వకంగా
యోధులతని చుట్టు చేరి ఉపన్యాసం
వినుచుండిరి విరమణానంతరం!
12.
"అంపశయ్య పై సామాన్యుడు"
కవితా గానం (సీజన్ -2)
అంశం : అంపశయ్య
శీర్షిక : "అంపశయ్య పై సామాన్యుడు"
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
తగ్గుతున్న ఆదాయాలు
ఖర్చులకి చాలినంతగా సంపాదించలేక సామాన్యుడు..
అంపశయ్యపై చేరిన భీష్ముడి లా అచేతనమై..
ఇల్లు గడపడమే కష్టమవుతుండగా ..
ఇంటిల్లిపాది కోర్కెలు తీర్చలేక నిస్సహాయుడై బేలగా చూస్తున్నాడు !
సమాజంలో పెరుగుతున్న ఆర్థిక తారతమ్యాలు
సామాన్యుడిని మరింత దిగజారుస్తుండగా ..ధనవంతుడ్ని మరింత ఉన్నతుడ్ని చేస్తుంటే ..
ఎవరికి వాళ్ళమే మన జీవితాలింతే అని సరిపెట్టుకుంటున్నాం !
ప్రస్తుత సమాజాన్ని సరిదిద్దాలంటే..సామాన్యుడి జీవన శైలి వృద్ధి చెందాలంటే..
ఆర్థిక తారతమ్యాలు తొలగిపోయేలా ఓ సరికొత్త విప్లవం రావాలి !
శ్రమిస్తున్న వారికి
వారి కష్టానికి తగిన ఫలం లభిస్తే ..
తప్పకుండా సామాన్యుడు కష్టాల అంపశయ్యపై నుండి విజయుడై లేచి నవ్య శకాన్ని సృష్టించగలడు !
రేపటి భారతం ప్రపంచానికే ఆదర్శం కాగలదు !
"అంపశయ్య పై సామాన్యుడు" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను .
_ గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
13.
కవితా గానం( సీజన్ 2)
అంశం....అంపశయ్య
శీర్షిక....సజీవ మంత్రాలు
ఉషః సంధ్య లతో పయనిస్తూ
ఊపిరి సలుపని
ఉచ్ఛాస్వ నిఛ్ఛాస్వల మధ్య ఊగిసలాడినప్పుడల్లా....
అలుపెరుగని యంత్రాల కరములకు
అరక్షణమైనా విశ్రాంతి లేనప్పుడల్లా...
నీరసానికి చిరుకోపాల
చిగుర్లు తొడిగి నప్పుడల్లా ....
గుండె బరువును
పంటి బిగువున
కవాటాలలో బంధించినప్పుడల్లా ....
ఆరిపోయిన పెదాలపై
చిరునవ్వుల పుప్పొడి
ఆర్తిగా నీవు అద్దినప్పుడల్లా...
కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభగా....
దశలవారీగా దిశలు
నీవు మారినప్పుడల్లా.....
ఓ మగువా సమాజంలో
ఆంక్షల అంపశయ్యపై
అనుక్షణం సుప్రభాతాల
పదవిన్యాసాలు తప్పవా
నీకు జీవన గమనంలో
సజీవ మంత్రాలుగా...!!
హామీ....నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ. గో. జి )
Comments
Post a Comment